వంటగ్యాస్ ధర పెరిగింది.. గృహవినియోగదారుల సిలిండర్పై రూ.16 భారం
- రూ.590.50 నుంచి 606.50కి చేరిన ధర
- వాణిజ్య సిలెండర్ ధర కూడా రూ.51 పెంపు
- చవితి ముందు రోజు నుంచే అమల్లోకి వచ్చిన కొత్త ధరలు
గృహ వినియోగదారులపై గ్యాస్ కంపెనీలు అదనపు భారం మోపాయి. పద్నాలుగు కిలోల బరువున్న సిలెండర్ ధరను 16 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ప్రతి నెలా ఒకటో తేదీన ధరలను ఆయిల్ కంపెనీలు సవరిస్తుంటాయి. ఇందులో భాగంగా ఈనెల ఒకటో తేదీనే సంస్థలు పెంపు నిర్ణయం తీసుకున్నాయి. కొత్త ధరలు ఆ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి. గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధరను రూ.590.50 నుంచి 606.50కు పెంచారు. అలాగే వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్ ధరను 1123 రూపాయల నుంచి 1174 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయిల్ సంస్థలు వెల్లడించాయి.