'సాహో' ఆలస్యానికి కారణాన్ని చెప్పిన యూనిట్!

  • ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన సాహో
  • యాక్షన్ సన్నివేశాలకు మరిన్ని హంగులు జోడిస్తున్న చిత్రబృందం
  • ఆగస్టు 30న తప్పకుండా విడుదల అవుతుందంటూ వెల్లడి
టాలీవుడ్ అగ్రశ్రేణి హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సాహో. బాహుబలి చిత్రాల తర్వాత ప్రభాస్ ఈ సినిమా కోసమే అత్యధిక సమయం కేటాయించాడు. శ్రద్ధా కపూర్ కథానాయికగా, సుజిత్ దర్శకత్వంలో వస్తున్న సాహో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టయినర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుందని తొలుత ప్రకటించినా, ఇప్పుడా నిర్ణయాన్ని చిత్రబృందం వాయిదా వేసింది.

సాహో ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వస్తుందని యూనిట్ సభ్యులు వెల్లడించారు. ఇక, సాహో విడుదల ఆలస్యానికి కారణం నాణ్యతలో రాజీపడకపోవటమేనంటూ చిత్రయూనిట్ చెబుతోంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలు మరింత నాణ్యతతో ఉంటే బాగుంటుందని చివరినిమిషంలో గుర్తించడంతో వాటికి మరిన్ని సొబగులు అద్దుతున్నారు. ఆగస్టు 15 లోపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేయడం కష్టమని భావించడంతో సాహో రిలీజ్ ను మరో 15 రోజులు వాయిదా వేసినట్టు చిత్ర యూనిట్ పేర్కొంది. ఆగస్టు 30న మాత్రం తప్పకుండా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపింది.
Go Back to Shorts
Saaho
Prabhas
Tollywood
Release

More Telugu News