విజయ్ దేవరకొండను కలిసిన పూరి జగన్నాథ్!
- 'డియర్ కామ్రేడ్' తో బిజీగా విజయ్ దేవరకొండ
- కాకినాడ వెళ్లి కథ వినిపించిన పూరి
- త్వరలో హీరో రామ్ తో సెట్స్ పైకి
విజయ్ దేవరకొండకి ఇప్పుడు యూత్ లో క్రేజ్ మాములుగా లేదు. ఆయన సినిమాలు చూడటానికి కుర్రకారు ఎలా ఎగబడుతున్నారో, ఆయనతో సినిమాలు చేయడానికి దర్శకులు అంతగా పోటీపడుతున్నారు. అలా ఆయనతో సినిమా చేయాలనుకునేవారిలో పూరి జగన్నాథ్ కూడా ఉన్నాడనే వార్తలు ఇటీవల వచ్చాయి. తాజాగా పూరి వెళ్లి విజయ్ దేవరకొండను కలవడంతో ఈ వార్త నిజమేనని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్' నిర్మితమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడలో జరుగుతోంది. రీసెంట్ గా పూరి అక్కడికి వెళ్లి విజయ్ దేవరకొండకి కథ చెప్పినట్టుగా తెలుస్తోంది. పూరి దూరదర్శన్ సీరియల్స్ కి పనిచేసే సమయం నుంచి విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధనరావుతో మంచి సాన్నిహిత్యం ఉందట. అందువలన ఆ వైపు నుంచి పూరి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం హీరో రామ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లేందుకు పూరి సన్నాహాలు చేసుకుంటున్నాడు.