చంద్రబాబుది నోరా? తాటిమట్టా?: బొత్స సత్యనారాయణ

  • ప్రతిపక్ష నేతపై ఏకవచనంతో ఘోరంగా మాట్లాడారు
  • సీఎం స్థాయిలో ఉన్న బాబు ఇలా మాట్లాడతారా?
  • ఏపీలో శాంతిభద్రతలు లేవు
కత్తిపోటుకు గురైన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి సీఎం చంద్రబాబు రాజకీయ ఉన్మాదిలా మాట్లాడుతున్నారని, ప్రతిపక్ష నేతపై ఏకవచనంతో ఘోరంగా వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు ఇలా మాట్లాడతారా? దాడి ఘటనను డ్రామా అంటారా? అని మండిపడ్డారు. దేవుడి దయ, ప్రజల దీవెనలతో జగన్ కు ప్రాణాపాయం తప్పిందని అన్నారు. ఏదైనా ఘటన జరిగితే మానవత్వం ఉన్నవారు స్పందిస్తారని, జగన్ ను రాజకీయపార్టీలు పరామర్శించకూడదా? చంద్రబాబుది నోరా? తాటిమట్టా? అని దుయ్యబట్టారు.

‘చంద్రబాబుకు చిన్నమెదడు చితికినట్టుంది. గాయమైతే ఆసుపత్రికి వెళ్తారా? పోలీస్ స్టేషన్ కు వెళ్తారా?’ అని ప్రశ్నించారు. పట్టుబడిన నిందితుడి వద్దకు లేఖ ఎలా వచ్చింది? ఒక ఎమ్మెల్యే హత్యకు గురైనప్పుడే మీ పాలన ఎలా ఉందో తెలిసిపోయిందని, ఏపీలో శాంతిభద్రతలు లేవని, ఏపీ పోలీసులపై నమ్మకం పోయిందని  విమర్శించారు. బాబులా చిల్లర రాజకీయాలు చేయడం తమ నాయకుడికి అలవాటు లేదని, చంద్రబాబు వ్యవస్థలను నిర్వీర్యం చేశారని బొత్స ఆరోపించారు.

Chandrababu
botsa
ys jagan

More Telugu News