ఇదే గరుడోత్సవం ప్రత్యేకత... అందుకే అంత ప్రాధాన్యం!

  • నేటి రాత్రికి గరుడ వాహనంపై ఊరేగనున్న వెంకన్న
  • మాడవీధుల్లోకి చేరుకుంటున్న లక్షలాది మంది
  • విశేషాభరణాలతో అలంకృతుడై కనువిందు చేయనున్న స్వామి
బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం... అందునా గరుడోత్సవం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవకు ఉన్న ప్రాశస్త్యం అంతాఇంతా కాదు. గరుడసేవ నాడు, తనకెంతో ప్రీతిపాత్రమైన గరుత్మంతుడిని అధిరోహించి, తిరుమాడవీధుల్లో విహరించే దేవదేవుని చూసి తరించాలని భావిస్తూ, ఎంతో ప్రయాసతో వచ్చిన లక్షలాది మంది భక్తులతో ఇప్పుడు తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి.

ఈ ఉదయం ఐదవరోజు ఉత్సవం జరుగుతుండగా, దంతపు పల్లికిలో మోహినీ వేషధారణలో స్వామి కనువిందు చేయనున్నారు. అది ముగియగానే, మాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి ఉదయం 11 గంటల నుంచి గరుడోత్సవాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులను అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది.

బంగారు గరుడ వాహనంపై స్వామివారు విశేష ఆభరణాలతో అలంకృతుడై, గజమాలలు, శ్రీవల్లి పుత్తూరు గోదాదేవి ఆలయం నుంచి వచ్చిన మాలలను స్వామివారు ధరించి భక్తులను కరుణించనున్నారు. గర్భాలయంలో మూలవరులకు సదా సమర్పణలో ఉండే చతుర్భుజ లక్ష్మీహారం, ఐదు పేటల సహస్రనామం, మకరకంఠి అనే పేరిట ఉండే ప్రాచీన మూడుపేటల తిరువాభరణం తదితరాలను స్వామివారికి అలంకరిస్తారు.

గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శించుకోవడం ద్వారా సర్పదోష శాంతి, దివ్యమైన జ్ఞానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. సమస్త వాహనాలలో సర్వ శ్రేష్టమైన గరుడవాహనంపై ఉన్న స్వామిని దర్శిస్తే, స్వర్గప్రాప్తి కలుగుతుందని, ఇహపరమైన ఈతిబాధల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. గరుడవాహన సేవ రోజున తిరుమలలో ఆకాశంలో గరుడపక్షుల సంచారం మరో అద్భుతం. గరుడసేవ జరిగే సమయానికి గాల్లో గద్దలు తిరుగుతూ కనిపించడం గమనార్హం. మిగతా ఏ సేవ రోజూ కూడా ఈ పక్షులు కనిపించవు. అందుకే గరుడోత్సవానికి అంతటి ఘనమైన ప్రాధాన్యముంది.
Go Back to Shorts
Tirumala
Tirupati
Garudotsavam

More Telugu News