'భరత్ అనే నేను' సినిమాపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు!

  • నవోదయం పార్టీ అధ్యక్షుడి ఫిర్యాదు
  • తమ పార్టీని కించపరిచేలా చూపించారంటూ ఆరోపణ
  • తగిన చర్యలు తీసుకోవాలంటూ వినతి
మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన 'భరత్ అనే నేను' చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. తాజాగా ఈ సినిమాపై నవోదయం పార్టీ అధ్యక్షుడు నల్లకరాజు గుంటూరు జిల్లా ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. 2010లో తమ పార్టీని స్థాపించామని, రిజిస్ట్రేషన్ కూడా చేయించామని ఆయన తెలిపారు. సినిమాలో తమ పార్టీ పట్ల ప్రజల్లో ద్వేషం కలిగించేలా చూపించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.

అనంతరం మీడియాతో నల్లకరాజు మాట్లాడుతూ, తమ పార్టీ జెండాలో ఉన్న ఉదయించే సూర్యుడి గుర్తును, నవోదయం అనే తమ పార్టీ పేరును సినిమాలో పలుమార్లు చూపిస్తూ, అప్రజాస్వామికమైన పదజాలాన్ని వాడారని మండిపడ్డారు. తమ పార్టీ లక్ష్యాలకు వ్యతిరేకమైన మాటలను చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. నవోదయం పార్టీ తరపున ఈ చిత్రంపై ఎస్పీకి ఫిర్యాదు చేశామని, తగిన చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. 
Go Back to Shorts
Bharath Ane Nenu
guntur
sp
complaint
navodayam party

More Telugu News