సంకల్ప యాత్ర పేరుతో జగన్ ముద్దుల యాత్ర చేస్తున్నారు: మంత్రి జవహర్

  • పొత్తు లేకుండానే 140 సీట్లు గెలుస్తాం
  • వైసీపీ, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉంది
  • బీజేపీకి రాజకీయ కాంక్ష ఎక్కువైంది
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండానే తెలుగుదేశం పార్టీ 140 స్థానాలను గెలుచుకుంటుందని ఏపీ మంత్రి జవహర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తతతో వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. సంకల్ప యాత్ర పేరుతో జగన్ ముద్దుల యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. భావి తరాలు సంతోషంగా ఉండాలంటే చంద్రబాబుకు మరో పదేళ్లు అధికారాన్ని కట్టబెట్టాలని చెప్పారు. బీజేపీ నేతల్లో రాజకీయ కాంక్ష పెరిగిపోయిందని... దీంతో, వారు అకృత్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో మెజార్టీ రానప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారని... వారి అధికార కాంక్షను ఇది సూచిస్తోందని చెప్పారు.

ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతోందని జవహర్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఒక మాట మాట్లాడుతూ, ఢిల్లీలో మరో విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు ప్రజలను మోసగించడానికే అని అన్నారు. బీజేపీ, వైసీపీల మధ్య చీకటి ఒప్పందం ఉందని చెప్పారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని జగన్ లక్ష కోట్లు సంపాదించారని... దీంతో, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. 

jawahar
jagan
Chandrababu
BJP

More Telugu News