కమల్ పార్టీపై శ్రుతి, అక్షర హాసన్ స్పందన ఇది...!

  • గాంధీ స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న శ్రుతి
  • ప్రజలతో మమేకమై మరిన్ని విజయాలు సాధించాలన్న అక్షర
  • సినిమాలకు బ్రేక్ ఇచ్చి పార్టీ బలోపేతంపై విశ్వనటుడి దృష్టి
ఇప్పటివరకు తన సినిమాలతో విశ్వనటుడిగా అలరించిన కమలహాసన్ 'మక్కళ్ నీది మయ్యమ్' అనే రాజకీయ పార్టీతో బుధవారం ప్రజాసేవలోకి అడుగుపెట్టారు. ఆయన రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తూ చాలామంది ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సినిమాల్లో మాదిరిగానే రాజకీయాల్లోనూ రాణించాలని వారంతా ఆకాంక్షించారు. ప్రస్తుతం సినిమా రంగంలో ఉన్న ఆయన కుమార్తెలు శ్రుతి హాసన్, అక్షర హాసన్‌లు కూడా తమ తండ్రికి తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు.

"మార్పు, రాజకీయ సంస్కరణ కోసం తొలి అడుగు వేసిన నా ప్రియమైన తండ్రికి విజయం చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను. గాంధీ స్ఫూర్తిగా మీరు ముందుకు సాగిపోవాలి. సత్యం, న్యాయ సాధన దిశగా మీ సంకల్పం, పట్టుదల కొనసాగుతుందని నేను కచ్చితంగా చెప్పగలను" అని శ్రుతి ట్వీట్ చేసింది.

మరో కుమార్తె అక్షర కూడా తన తండ్రికి శుభాకాంక్షలు తెలిపింది. "మీ రాజకీయ ప్రవేశం గర్వపడాల్సిన విషయం. వ్యక్తిగా విజయం సాధించిన మీరు ప్రజలతో మమేకమై మరిన్ని విజయాలు సాధించాలి. ఓ పౌరుడిగా అది మీ బాధ్యత" అని ఆమె ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే, కమల్ ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమాలకు కాస్త విరామమిచ్చి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు.
Go Back to Shorts
Kamal hasan
Sruthi hasan
Akshara hasan

More Telugu News