తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి!

తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి!
  • రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా
  • వీలైనంత త్వరగా నియామక ఉత్తర్వులు
  • అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు నియామక ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా నియామక ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యులను కూడా త్వరలోనే నియమించనున్నట్లు సీఎం వెల్లడించారు.

వచ్చే జూన్ మాసంలోపు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు రైతు సమన్వయ సమితులను బలోపేతం చేసి, రైతులను సంఘటిత శక్తిగా మార్చాలని సీఎం నిర్ణయించారు. క్లస్టర్ల వారీగా రైతు వేదికల నిర్మాణం కూడా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. విత్తనం వేసే దగ్గర నుంచి పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులకు చేదోడు వాదోడుగా ఉండే విధంగా రైతు సమన్వయ సమితులను పటిష్టమైన పద్ధతుల్లో తీర్చిదిద్దాలని సీఎం భావిస్తున్నారు. రైతు సమన్వయ సమితుల బలోపేతం, రైతులను సంఘటిత శక్తిగా మార్చడం, రైతు వేదికల నిర్మాణం, ఇతర రైతు సంబంధ అంశాలపై మూడు నాలుగు రోజులలోనే వ్యవసాయ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.

కాగా, రైతుసమన్వయ సమితి అధ్యక్షునిగా తనను నియమించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం సీఎంను ఆయన ప్రగతిభవన్ లో కలిసి ధన్యవాదాలు చెప్పారు. రాజేశ్వర్ రెడ్డిని ముఖ్యమంత్రి అభినందించారు. రైతులకు అన్ని వేళలా అండదండగా ఉండే విధంగా రైతు సమన్వయ సమితులను సమర్థవంతంగా నిర్వహించాలని రాజేశ్వర్ రెడ్డికి సీఎం సూచించారు.
KCR
Palla Rajeshwarreeddy
TRS
Hyderabad
Telangana

Watch Today's Deals on Amazon

More Press News