మెదక్ జిల్లాలో చిరుత మృతి.. ఖననం చేసిన అధికారులు

మెదక్ జిల్లాలో చిరుత మృతి.. ఖననం చేసిన అధికారులు
మెదక్ జిల్లాలో చనిపోయిన చిరుతకు అటవీ శాఖ పోస్టు మార్టమ్ నిర్వహించింది. శంకరం పేట్ (ఆర్) వెటర్నటీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ గీత ఆధ్వర్యంలో జరిగిన పోస్టు మార్టమ్ లో చిరుత మృతికి కారణాలు తెలియరాలేదు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవు. అలాగే ఉచ్చులు, విద్యుత్ గానీ పెట్టిన ఆనవాళ్లు కూడా లభించలేదు. తోకపైన మాత్రం ముళ్లపంది ముళ్లను గుర్తించారు. దీంతో చిరుత మృతికి కారణాలను గుర్తించేందుకు అంతర్గత అవయవాలను సేకరించిన డాక్టర్లు తదుపరి పరీక్షల కోసం సంగారెడ్డి వెటర్నిటీ ల్యాబ్ కు తరలించారు. చిరత కళేబరాన్ని అధికారుల సమక్షంలో ఖననం చేశారు. మెదక్ జిల్లా అటవీ అధికారి జీ. జ్ఞానేశ్వర్, రేంజ్ ఆఫీసర్ నదియా తబుస్సుమ్, సెక్షన్ ఆఫీసర్ టీ. కృష్ణ, సిబ్బంది పర్యవేక్షణలో పోస్టు మార్టమ్, ఖననం జరిగాయి.

అంతకు ముందు.. ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో మెదక్ జిల్లా రామాయం పేట్ రేంజ్ ఖాజాపూర్ రిజర్వు ఫారెస్ట్ పరిధి పటేల్ చెరువులో చిరుత కళేబరాన్ని చూసిన ఖాజాపూర్ గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది, చిరుత మృతదేహాన్ని బయటకు తీసి, వెటర్నటీ డాక్టర్ల సమక్షంలో పరిశీలించారు. అలాగే పరిసరాల్లో గాలించి ప్రమాద కారణాలను ఆరా తీశారు. చిరుత గోర్లు యథావిధిగా ఉండటం, శరీరం బయట ఎలాంటి గాయాలు లేకపోవటంతో వేటగాళ్ల ప్రమేయం ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
Medak District
Telangana

Watch Today's Deals on Amazon

More Press News