పురాణపండ శ్రీనివాస్ ఆధ్యాత్మిక యాత్ర.. ఒకే రోజు మూడు మహాక్షేత్రాల సందర్శన

ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత, ప్రవచనకర్త పురాణపండ శ్రీనివాస్ ఒకే రోజు మూడు ప్రధాన పుణ్యక్షేత్రాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు భద్రాద్రి, యాదాద్రి, హైదరాబాద్లోని ప్రసిద్ధ ఆలయాలను ఆయన దర్శించుకున్నారు. తన రచనల ద్వారా విస్తృత ధార్మిక సేవ చేస్తున్న ఆయన, ఈ ఆలయాల సందర్శనతో ఆధ్యాత్మిక వర్గాల్లో చర్చనీయాంశమయ్యారు.

వివరాల్లోకి వెళితే, బుధవారం ఉదయం భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవంలో పురాణపండ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులతో ఆయన వైదిక, వైష్ణవ సంప్రదాయాలపై ముచ్చటించారు. అనంతరం సాయంత్రం యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. అక్కడ ఆలయ అధికారులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం చేయించారు. దర్శనానంతరం మంటపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు.

    
అదే రోజు రాత్రి, వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్లోని ప్రసిద్ధ మహావీర్ హనుమాన్ మందిరాన్ని శ్రీనివాస్ సందర్శించారు. అక్కడ ఆయన భజరంగబలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మార్వాడీ బ్రాహ్మణ పూజారులు ఆయనకు స్వామివారి మహిమలు, ఆలయ విశిష్టతను వివరించారు. ఈ మూడు ఆలయాల్లోనూ పురాణపండ శ్రీనివాస్ రచించి, సంకలనం చేసిన పలు గ్రంథాలను ఆయన అనుచరులు అక్కడి ధర్మకర్తలకు, వేద పండితులకు అందజేశారు.

కాగా, పురాణపండ శ్రీనివాస్ నిస్వార్థంగా చేస్తున్న ధార్మిక సేవలను గతంలో పలు సందర్భాల్లో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, సీనియర్ ఐఏఎస్ అధికారులు కేవీ రమణాచారి, ఎల్వీ సుబ్రహ్మణ్యం వంటి వారు ప్రశంసించిన విషయం తెలిసిందే. ఆయన సేవలు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశ విదేశాల్లోని తెలుగు వారికి చేరువయ్యాయని వారు కొనియాడారు.

More Press Releases