అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అత్యంత అప్రమత్తంగా ఉండాలి: పీసీసీఎఫ్ ఆర్ శోభ ఆదేశం

అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అత్యంత అప్రమత్తంగా ఉండాలి: పీసీసీఎఫ్ ఆర్ శోభ ఆదేశం
  • ప్రమాదాలపై తక్షణ స్పందనకు ప్రత్యేకంగా క్విక్ రెస్పాన్స్ టీమ్ ల ఏర్పాటు

  • ప్రమాదాలు జరిగాక నిప్పును ఆర్పటం కాదు,  జరగకుండా నివారణ చర్యలు ముఖ్యం

  • అన్ని జిల్లాల అటవీ అధికారులు, సిబ్బందికి అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆదేశాలు

హైదరాబాద్: వేసవి సమీపిస్తున్నందున అటవీ సంరక్షణలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని పీసీసీఎఫ్ ఆర్.శోభ ఆదేశించారు. అగ్ని ప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన చర్యలపై అన్ని జిల్లాల అటవీ అధికారులతో అరణ్య భవన్ నుంచి ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఎండాకాలంలో సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలని, అగ్ని ప్రమాద నివారణ చర్యలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని పీసీసీఎఫ్ తెలిపారు. అటవీ మార్గాలు, అడవుల వెంట ఉండే గ్రామాల్లో తక్షణం ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. మొత్తం 9,771 కంపార్ట్ మెంట్లకుగాను 43 అటవీ రేంజ్ ల్లో 1106 ప్రాంతాలు అగ్ని ప్రమాదాలకు అత్యంత ఆస్కారం ఉన్న వాటిగా గుర్తించారు. వీటిల్లో కనీసం ఐదుగురు సిబ్బంది, వాహనం, నిప్పును ఆర్పే బ్లోయర్ పరికరాలతో వెంటనే క్విక్ రెస్పాన్స్ టీమ్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

అన్ని కంపార్ట్ మెంట్లలో ఫైర్ లైన్లను ఏర్పాటుచేసి, ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఉపగ్రహం ద్వారా అడవుల్లో అగ్ని ప్రమాదాలను మానిటర్ చేసే విధానం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (FSI) ద్వారా అమల్లో ఉందని, ఎక్కడ ప్రమాదం జరిగినా ఆ ప్రాంతంలో సంబంధిత అధికారులతో పాటు, గ్రామ కార్యదర్శికి కూడా ఫోన్ సందేశం వెళ్తుందన్నారు. ఇప్పటిదాకా 11,700 పేర్లు, నెంబర్లు ఇందుకోసం రిజిస్టర్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

అగ్ని ప్రమాద నివారణ చర్యల కోసం అవసరమైన నిధులను అన్ని జిల్లాలకు అందుబాటులో ఉంచనున్నట్లు పీసీసీఎఫ్ వెల్లడించారు. ఫిబ్రవరి నుంచి మే నెల దాకా అటవీ అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అటవీ మార్గాల్లో ప్రయాణీకులకు నిప్పు నివారణపై అవగాహన కల్పించాలని, వంట చేయటం, సిగరెట్, బీడీ లాంటివి పడేయకుండా చూడాలన్నారు. ఇటీవల నల్లమలలో జరిగిన రెండు సంఘటనలు కూడా ఒకటి పశువుల కాపరులు, మరొకటి ప్రయాణీకుల విసిరిన సిగరెట్/ బీడీ వల్ల ప్రమాదాలు జరిగినట్లు గుర్తించామన్నారు. మేడారం జాతర జరుగుతున్న అటవీ ప్రాంతంలో కూడా నిత్యం అప్రమత్తంగా ఉంచాలని అటవీ సిబ్బందిని ఉన్నతాధికారులు కోరారు.

సమావేశంలో ఇంకా అటవీ పునరుజ్జీవన చర్యలు, అర్బన్ ఫారెస్ట్ పార్కుల నిర్మాణం పురోగతి, కంపా నిధులతో చేపట్టిన పనులు, ప్రత్యామ్నాయ అటవీకరణ పనులు, వచ్చే హరితహారం సీజన్ కోసం నర్సరీల సంసిద్ధతపై చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్ లో పీసీసీఎఫ్ ఆర్.శోభతో పాటు అదనపు పీసీసీఎఫ్ లు లోకేష్ జైస్వాల్, ఆర్.ఎం. డోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, ఎం.సి. పర్గెయిన్, సిద్దానంద్ కుక్రెటీ, అన్ని జిల్లాలకు చెందిన అటవీ అధికారులు పాల్గొన్నారు.

Forest Department
Telangana

Watch Today's Deals on Amazon

More Press News