రెండో రోజు విజయవంతంగా ప్రజాపాలన - సి.ఎస్. శాంతి కుమారి.

రెండో రోజు విజయవంతంగా ప్రజాపాలన - సి.ఎస్. శాంతి కుమారి.
కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సి.ఎస్ హైదరాబాద్, డిసెంబర్ 29 :: ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందేలా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమానికి రెండోరోజు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో రెండవ రోజు కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో నేడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

మొదటి రోజు ప్రజాపాలన ప్రజా సదస్సులలో ఎదురైన సమస్యలను పునరావృత్తం కాకుండా నేడు చర్యలు తీసుకోవడంపట్ల అభినందనలు తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ దరఖాస్తు ఫారాలు విక్రయించకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రజా పాలన కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పించాలని సి.ఎస్ అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కల్గకుండా ఏర్పాట్లు చేయాలని, అభయ హస్తం దరఖాస్తులు నింపడంలో ప్రజలకు సహకరించేలా వాలంటీర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి వంద దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలన్నారు. పురుషులకు, మహిళలకు వేరు వేరు క్యూలైన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా షామియానా, బారికేడింగ్, తాగునీరు ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. 


ఈ కార్యక్రమానికి ముందుగా తయారు చేసిన గ్రామ సభల షెడ్యూల్ ను ప్రెస్, మీడియా లో విస్తృతంగా ప్రచారం చేసెందుకు చర్యలు తీసుకోవాలని సి.ఎస్. సూచించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధుల సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగేవిధంగా జిల్లా అధికారులందరు కృషి చేయాలన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో మున్సిపల్, పంచాయితీ రాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు దాన కిషోర్, సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
Praja Palana
CS Shanti Kumari

Watch Today's Deals on Amazon

More Press News