గుడ్ న్యూస్.. హైదరాబాద్ - విజయవాడ మధ్య ‘ఫ్లై 91’ విమాన సర్వీసులు ప్రారంభం
- 'ఫ్లై 91' విమాన సర్వీసులను ప్రారంభించిన రామ్మోహన్ నాయుడు
- ఈ అదనపు సర్వీసు ప్రయాణికులకు ఎంతో ఉపశమనం ఇస్తుందన్న కేంద్ర మంత్రి
- టైర్-2, టైర్-3 నగరాలను అనుసంధానించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని వ్యాఖ్య
హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఒక శుభవార్త. ప్రాంతీయ విమానయాన సంస్థ 'ఫ్లై 91' (Fly 91) తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య తన నూతన సర్వీసులను అధికారికంగా ప్రారంభించింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసును ఈరోజు శ్రీకాకుళం నుంచి వర్చువల్గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ - విజయవాడ మార్గంలో ఈ అదనపు సర్వీసు ప్రయాణికులకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సామాన్యులకు సైతం విమాన ప్రయాణాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా ఈ సంస్థ తక్కువ ధరలో వేగవంతమైన సేవలను అందిస్తోందని చెప్పారు. దేశవ్యాప్తంగా టైర్-2, టైర్-3 నగరాలను అనుసంధానించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడం ద్వారా సామాన్యులు కూడా విమానం ఎక్కాలన్న ప్రధాని మోదీ కల నిజమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.