ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో 'మా' సభ్యులకు మంచు విష్ణు కీలక సూచన

Manchu Vishnu key acvice to MAA members
  • సున్నితమైన అంశాలపై ఎవరూ బహిరంగ ప్రకటన చేయవద్దన్న విష్ణు
  • ఇలాంటి సమయంలో మనందరికీ సహనం, ఐక్యత అవసరమని వ్యాఖ్య
  • సమస్యలను అందరం కలసికట్టుగా ఎదుర్కొందామని సూచన
ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు, సినీ నటుడు మంచు విష్ణు కీలక ప్రకటన చేశారు. సున్నితమైన విషయాలపై ఎవరూ స్పందించకపోవడం మంచిదని ఆయన సూచించారు. సినీ కళాకారులు అన్ని ప్రభుత్వాల ప్రజాప్రతినిధులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారని చెప్పారు. గతంలో వివిధ ప్రభుత్వాల మద్దతుతో సినీ పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో స్థిరపడటానికి ఆనాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం అందించిందని చెప్పారు. అప్పటి నుంచి ప్రతి ప్రభుత్వంతో మన పరిశ్రమకు ఎల్లప్పుడూ సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు. 

ఇటీవల జరిగిన పరిణామాలను అందరూ దృష్టిలో పెట్టుకోవాలని... 'మా' సభ్యులందరూ సున్నితమైన అంశాలపై వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించడం మానుకోవాలని విష్ణు సూచించారు. కొన్ని సమస్యలు వ్యక్తిగతమైతే, మరికొన్ని విషాదకరమైనవని చెప్పారు. అలాంటి అంశాలపై మాట్లాడటం వల్ల అది సమస్యను పరిష్కరించడానికి బదులు... సంబంధిత పక్షాలకు మరింత నష్టం చేకూర్చుతుందని అన్నారు. ఇలాంటి సమయంలో మనందరికీ సహనం, ఐక్యత, సానుభూతి అవసరమని చెప్పారు. ఏ సమస్య వచ్చినా అందరం కలసికట్టుగా ఎదుర్కొందామని అన్నారు.
Go Back to Shorts
Manchu Vishnu
Tollywood

More Telugu News