టీమిండియా ఓటమికి సాకులు వెదకదల్చుకోలేదు: గంభీర్

Gambhir comments on Team India loss
  • రేపటి నుంచి టీమిండియా, న్యూజిలాండ్ మూడో టెస్టు
  • ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమిండియా
  • ఓటమి ఎవరికైనా బాధ కలిగిస్తుందన్న గంభీర్        
సొంతగడ్డపై తిరుగులేని జట్టుగా ఉన్న భారత్ ను న్యూజిలాండ్ వరుసగా రెండు టెస్టుల్లో ఓడించి సంచలనం సృష్టించింది. మరో టెస్టు మిగిలుండగానే సిరీస్ చేజిక్కించుకుంది. దాంతో టీమిండియా ఇప్పుడు మూడో టెస్టులో పరువు కోసం పాకులాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

న్యూజిలాండ్ తో సిరీస్ లో టీమిండియా ఓటమికి సాకులు చెప్పదల్చుకోలేదని స్పష్టం చేశాడు. సిరీస్ ఓటమితో టీమిండియా బాధకు గురైందని పేర్కొన్నాడు. 

"తియ్యని మాటలు చెప్పి ఈ సిరీస్ ఓటమి నుంచి దృష్టి మరల్చలేను. ఓటమి అంటే ఓటమే.... ఓటమి తప్పకుండా బాధ కలిగిస్తుంది. ఓటమి కూడా మంచిదే. మనల్ని మనం మెరుగుపర్చుకునేందుకు ఓటమి దోహదపడుతుంది. ఓడిపోయినందుకు బాధపడడంలేదని చాలామంది చెబుతుంటారు... కానీ ఓటమి కచ్చితంగా బాధిస్తుంది. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు ఈ ఓటమి చాలా వేదన కలిగించి ఉంటుంది. దాంతో, తర్వాతి మ్యాచ్ లో బాగా ఆడాలని వారు తమను తాము సన్నద్ధం చేసుకుంటారని భావిస్తున్నాను. మేం కోరుకునేది కూడా అదే" అని గంభీర్ వివరించారు. 

రేపటి నుంచి టీమిండియా-న్యూజిలాండ్ మధ్య ముంబయిలో మూడో టెస్టు జరగనుంది. ఈ క్రమంలో వాంఖెడే స్టేడియంలో మీడియాతో మాట్లాడుతూ గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
Go Back to Shorts
Gautam Gambhir
Team India
New Zealand
Test Series

More Telugu News