కేసీఆర్ పాలనలాగే రేవంత్ రెడ్డి పాలన సాగుతోంది: కిషన్ రెడ్డి

Kishan Reddy alleges Revanth Reddy is ruling like KCR
  • ఎన్నికల హామీలకు కాంగ్రెస్ తూట్లు పొడుస్తోందని విమర్శ
  • రుణమాఫీని సీఎం గందరగోళంగా మార్చివేశారని ఆగ్రహం
  • దేవుళ్లపై ఒట్లు వేసి మరీ మాట తప్పారన్న కిషన్ రెడ్డి
రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్ పాలనలాగే సాగుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం సికింద్రాబాద్‌లో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ నేతలు చెప్పినట్లుగా రైతులకు రుణమాఫీ కాలేదని విమర్శించారు. ఎన్నికల హామీలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. రుణమాఫీని సీఎం అంతా గందరగోళంగా మార్చివేశారన్నారు. దేవుళ్లపై ఒట్లు వేసి మరీ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కనీసం సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదన్నారు. రుణమాఫీకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసే వరకు ప్రజలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. 

వ్యక్తులు, కుటుంబాల కోసం నడిచే పార్టీ బీజేపీ కాదన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమన్నారు. బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలే కోరుకుంటున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ ముక్తి దివస్‌గా ఘనంగా నిర్వహిస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల స్ఫూర్తితో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కుటుంబాల కోసం అవీనితికి పాల్పడుతున్న పార్టీలను తరిమి కొట్టాలన్నారు.
Go Back to Shorts
G. Kishan Reddy
BJP
Telangana
Congress
Revanth Reddy

More Telugu News