తెలంగాణకు రెడ్ అలెర్ట్.. పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన

IMD Predicts Heavy To Heavy Rains In Telangana Today And Tomorrow
  • నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ
  • ఆయా ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిక
  • ఒకేసారి వరద ముందుకొచ్చి రోడ్లు కొట్టుకుపోయే అవకాశం ఉందన్న వాతావరణశాఖ అధికారులు
  • అప్రమత్తంగా ఉండాలని సూచన
తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీచేసింది. నేడు ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. కుమ్రం భీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

రేపు (20న) ఆదిలాబాద్, కుమ్రంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, జయశంకర్-భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. మరో ఐదారు జిల్లాలలోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

ప్రమాదాలు ముంచుకొస్తాయ్.. జాగ్రత్త
ఆయా ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకుపైగా వర్షం పడే అవకాశం ఉందని, ఒకేసారి వరద ముంచుకురావడం, రోడ్లు, లోలెవల్ వంతెనలు మునిగిపోవడం, కొట్టుకుపోవడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే, కొన్ని ప్రాంతాల్లో  గంటకు 50 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కాగా, నిన్న కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం పెద్దంపేటలో అత్యధికంగా 13.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
Go Back to Shorts
Heavy Rains
Telangana
IMD

More Telugu News