చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన సజ్జల

Sajjala fires on Chandrababu
  • హామీల విషయంలో చంద్రబాబు సన్నాయినొక్కులు నొక్కుతున్నారన్న సజ్జల
  • ప్రజలను మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపాటు
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చంద్రబాబుకు 6 నెలల క్రితమే తెలుసని వ్యాఖ్య
ఏపీలోని ఎన్డీయే ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా గడవక ముందే... ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం సాధ్యం కాదని సన్నాయినొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందని అంటున్నారని... అన్నీ తెలిసి, ఆచరణ సాధ్యం కాని హామీలను ఎందుకిచ్చారో వాళ్లే చెప్పాలని అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఎలా మోసం చేశారో... అలాంటి మోసానికే మళ్లీ శ్రీకారం చుట్టారని చెప్పారు. 

రాష్ట్ర ఖజానా ఇంత దారుణంగా ఉందని అనుకోలేదని చంద్రబాబు అంటున్నారని... 6 నెలల క్రితమే ఈ విషయం ఆయనకు తెలుసని... అయినప్పటికీ అధికారంలోకి రావడానికి అబద్ధపు హామీలు ఇచ్చారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలకు పాల్పడుతున్నారని, వైసీపీకి ఓటు వేశారంటూ ప్రజలను హింసిస్తున్నారని, వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కక్ష సాధింపులకు పాల్పడలేదని... ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగించారని అన్నారు.
Go Back to Shorts
Sajjala Ramakrishna Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News