కర్ణాటకలో 15వ శతాబ్దం నాటి రాతి స్తూపం లభ్యం

Ancient stone pillar found in Karnataka
  • అరసళే రాజు పేరిట శాసనం
  • 1442 సంవత్సరం నాటి రాతి స్తంభం
  • నాడు తిరుమల ఆలయానికి విరాళంగా ఇచ్చినట్టు గుర్తింపు
కర్ణాటకలో ఓ పురాతన శిలాశాసనం బయల్పడింది. చరిత్రకారుడు, కర్ణాటక కళాశాల విద్యాశాఖ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ కేఆర్ నరసింహన్, ఔత్సాహిక చరిత్రకారుడు, రిటైర్డ్ బీఎంటీసీ డ్రైవర్ ధన్ పాల్... కోలార్ తాలూకాలోని నాదుపల్లి గ్రామం వద్ద ఈ ప్రాచీన రాతి స్తూపాన్ని కనుగొన్నారు. ఇది 15వ శతాబ్దం నాటిదని భావిస్తున్నారు. 

ఈ శాసనంతో కూడిన స్తంభం ఓ ఆలయం వద్ద పడి ఉండడాన్ని నాదుపల్లి గ్రామస్తులు గుర్తించారు. దీనిపై సమాచారం అందుకున్న కేఆర్ నరసింహన్ తన సహ చరిత్రకారుడు ధన్ పాల్ తో కలిసి నాదుపల్లి గ్రామానికి వచ్చారు. స్థానికుల సాయంతో ఆ స్తంభాన్ని వెలికి తీసి, శుభ్రం చేశారు. ఆ స్తూపంపై 'కంభ సేవె' (వైష్ణవ ఆలయానికి విరాళంగా ఓ స్తంభం) వివరాలు ఉన్నట్టు కేఆర్ నరసింహన్ తెలిపారు. కన్నడ భాషలో ఎనిమిది పంక్తులు రాసి ఉన్నాయని వెల్లడించారు. 

ఈ స్తంభం సహజంగా ఆలయాల ముందు నిలిపే ధ్వజస్తంభం వంటిదని, దీన్ని గరుడ కంభగా పిలుస్తారని ఆయన వివరించారు. ఈ స్తూపాన్ని తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి విరాళంగా ఇచ్చినట్టు, దానిపై చెక్కిన శాసనం ద్వారా తెలుస్తోందని కేఆర్ నరసింహన్ వెల్లడించారు. 1442లో ఆరసళే రాజు పేరిట ఈ శాసనం ఉందని పేర్కొన్నారు. మతపరమైన చిహ్నాలు శంఖము, గరుడ, చక్రము, నామాలు దీనిపై చెక్కారని తెలిపారు. 

కాగా, ఈ శాసనం చాలా విలక్షణంగా ఉందని, సహజంగా శిలాశాసనాలు అడ్డంగా పొందుపరుస్తారని, కానీ నాదుపల్లిలో లభ్యమైన స్తంభంపై శాసనం మాత్రం నిలువుగా ఉందని కేఆర్ నరసింహన్ వెల్లడించారు.
Go Back to Shorts
Stone Pillar
Nadupalli
Kolar
KR Narasimhan
Dhanpaul
Karnataka

More Telugu News