గత 20 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధగా ఉంది: బొత్స

Botsa says he has been worrying with past 20 days developments
  • వైసీపీ కార్యాలయాలు నిబంధనలకు లోబడే నిర్మిస్తున్నామన్న బొత్స
  • తమ కార్యాలయాల్లోకి అధికార పార్టీ నేతలు చొరబడుతున్నారని ఆగ్రహం
  • వర్సిటీ వీసీలపైనా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపణ
ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గత 20 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధగా ఉందన్నారు. తమ పార్టీ కార్యాలయాల్లోకి అధికార పార్టీ నేతలు చొరబడుతున్నారని, గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోలేదని అన్నారు. 

నిబంధనలకు లోబడే తమ పార్టీ కార్యాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయని బొత్స స్పష్టం చేశారు. విపక్ష వైసీపీ కార్యాలయానికి వెళ్లి అధికార పార్టీ ఎమ్మెల్యే పరిశీలించడం ఏంటని మండిపడ్డారు. కావాలనుకుంటే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పరిశీలించుకోండి అని వ్యాఖ్యానించారు. 

యూనివర్సిటీల్లో వీసీలపైనా దౌర్జన్యాలు జరుగుతున్నాయని వెల్లడించారు. యూనివర్సిటీల్లో వీసీలను నామినేట్ చేయడం అనేది ఒక విధానం అని, ఒకవేళ ఆ వీసీ పద్ధతి నచ్చకపోతే నోటీసులు ఇవ్వొచ్చని బొత్స అభిప్రాయపడ్డారు. కానీ వీసీ చాంబర్లలోకి వెళ్లి బెదిరించడం, వారిని బలవంతంగా తొలగించడం సరికాదని అన్నారు.

ఇక విద్యాశాఖలో తనపై వచ్చిన ఆరోపణలు పట్ల  స్పందించాల్సిన అవసరం లేదని, ఫైళ్లన్నీ వాళ్ల వద్దే ఉన్నాయని, పరిశీలించుకోవచ్చని బొత్స పేర్కొన్నారు. 

అదే సమయంలో, కొందరు రిటైర్డ్ ఉన్నతాధికారులు నాటి జగన్ ప్రభుత్వం గురించి ఇప్పుడు బయటికి వచ్చి మాట్లాడుతుండడంపై కూడా బొత్స స్పందించారు. కొందరు రిటైర్డ్ అధికారులు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడకుండా, అధికారం పోయాక మాట్లాడుతుంటారని, ఇది ఎంతవరకు సబబు? అని బొత్స ప్రశ్నించారు.
Go Back to Shorts
Botsa Satyanarayana
YSRCP
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News