ఆరు నెలల్లో 11 సార్లు ఢిల్లీ వెళ్లిన ఏకైక సీఎం... రేవంత్ రెడ్డి: బీజేపీ నేత ప్రభాకర్

NVSS Prabhakar lashes out at CM Revanth Reddy
  • ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటినా రేవంత్ పట్టు సాధించలేదని విమర్శ
  • తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపాటు
  • కేసీఆర్ కనుసన్నుల్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఆరోపణ
ఆరు నెలల పాలనలో 11 సార్లు ఢిల్లీ వెళ్లిన ఏకైక ముఖ్యమంత్రి... రేవంత్ రెడ్డేనని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటినా ముఖ్యమంత్రి ఇప్పటికీ పాలనపై పట్టు సాధించలేకపోయారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆరు నెలల కాలంలో పెద్ద ఎత్తున ఐపీఎస్, ఐఏఎస్ ల బదిలీలు మాత్రమే చేశారన్నారు. బదిలీల కారణంగా అధికారులు ఆయా శాఖలపై పట్టు సాధించలేకపోతున్నారన్నారు.

తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. హత్యలు, అత్యాచారాలు జరిగితే సమీక్షించే నాథుడే కరవయ్యాడన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వం కొత్త ప్రయోగం చేస్తోందన్నారు.

కేసీఆర్ కనుసన్నుల్లోనే కాంగ్రెస్‌లోకి...

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆరే కాంగ్రెస్ పార్టీలోకి పంపిస్తున్నారని ఆరోపించారు. ఆయన కనుసన్నుల్లోనే పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయన్నారు. ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు అవుతోందని... రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ బ్లాక్ డేను నిర్వహిస్తోందన్నారు.
Go Back to Shorts
NVSS Prabhakar
BJP
Revanth Reddy
Congress

More Telugu News