యూజీసీ నెట్ - 2024 పరీక్ష రద్దు!

UGC NET Exam cancelled by NTA
  • యూజీసీ నెట్ పరీక్షలో అవకతవకలు జరిగినట్టు యూజీసీ నిర్ధారణ
  • పరీక్ష రద్దు చేస్తూ ఎన్‌టీఏ నిర్ణయం
  • పరీక్షల్లో పారదర్శకత కోసమే పరీక్షను రద్దు చేశామన్న కేంద్ర విద్యాశాఖ
  • ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 9 లక్షల మంది హాజరైన వైనం
నీట్ కలకలం కొనసాగుతున్న వేళ ఎన్‌టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 18న నిర్వహించిన యూజీసీ నెట్ - 2024 పరీక్షను రద్దు చేసింది. దేశంలోని యూనివర్శిటీల్లో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్‌డీలలో ప్రవేశాల కోసం జరిగే ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. యూజీసీ నెట్ పరీక్షలో అవకతవకలు జరిగినట్టు యూజీసీ నిర్ధారణకు రావడంతో ఎన్‌టీఏ ఈ నిర్ణయం తీసుకుంది. 

పరీక్షల్లో పారదర్శకత కాపాడుకోవడం కోసమే రద్దు నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఈ పరీక్షలో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించింది. పరీక్షల పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. కాగా, మంగళవారం దేశవ్యాప్తంగా 1205 సెంటర్లలో జరిగిన ఈ పరీక్షకు దాదాపు 9 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.

మరోవైపు, మెడికల్ ఎంట్రన్స్ టెస్టు నీట్ పేపర్ లీకేజీపై వస్తున్న ఆరోపణలపై కూడా కేంద్రం స్పందించింది. సమయం కోల్పోయిన విద్యార్థులకు కలిపిన గ్రేస్ మార్కులు రద్దు చేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. పాట్నాలో నీట్ అవకతవకలపై పోలీసులు విచారణ చేస్తున్నారని వెల్లడించింది. ప్రాథమిక ఆధారాల మేరకు నీట్‌లో అవకతవకలు జరిగినట్టు నిర్ధారణకు వచ్చామని, బీహార్ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని పేర్కొంది.
Go Back to Shorts
UGC NET
NTA
UGC
Central Education Ministry

More Telugu News