వైసీపీ కార్యకర్తలు వృద్ధులను మంచాలపై మోసుకొస్తున్నారు... ఇది ఈసీ ఆదేశాలకు విరుద్ధం: వర్ల రామయ్య

Varla Ramaiah wrote EC and CS over pension distribution
  • ఏపీలో నేటి నుంచి సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ
  • వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలన్న నిబంధనను ఉల్లంఘిస్తున్నారన్న వర్ల
  • ఇప్పటికీ నగదు సచివాలయాలకు రాలేదని వెల్లడి
ఈసీ ఆదేశాల మేరకు ఏపీలో ఇవాళ సచివాలయాల ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. అయితే, వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, వైసీపీ కార్యకర్తలు ఆ ఆదేశాలను ధిక్కరిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఈ మేరకు ఈసీ, సీఎస్ లకు వర్ల రామయ్య లేఖ రాశారు. 

పెన్షన్లకు సంబంధించి నగదు ఇప్పటికీ నగదు సచివాలయాలకు అందలేదని వర్ల రామయ్య తెలిపారు. వైసీపీ కార్యకర్తలు వృద్ధులను మంచాలపై సచివాలయాలకు మోసుకొస్తున్నారని, వైసీపీ కార్యకర్తలు ఈసీ ఆదేశాలను ఉల్లంఘిస్తుంటే అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఇళ్ల వద్దే పెన్షన్లు అందించేలా ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 

ఇదే అంశంపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా కూడా స్పందించారు. పెన్షన్ల కోసం వృద్ధుల్ని ఇబ్బంది పెడతారా? ప్రచార పిచ్చితో వృద్ధులను మంచాలపై ఊరేగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రతిపక్షాలపై విషప్రచారం చేస్తున్న వైసీపీ నేతలపై ఈసీ చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమా విజ్ఞప్తి చేశారు. 

ఓట్ల కక్కుర్తితో వైసీపీ నేతలు, అధికారులు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తారా? అని ధ్వజమెత్తారు. తొమ్మిది మంది అధికారులపై ఈసీ చర్యలు తీసుకున్నా... ఇంకా మార్పు రాదా? అని ప్రశ్నించారు. అస్మదీయులకు ఖజానా దోచిపెట్టారని, దాంతో సచివాలయాలకు ఇంకా పెన్షన్ డబ్బు చేరలేదని ఆరోపించారు.
Go Back to Shorts
Varla Ramaiah
Pensions
TDP
YSRCP

More Telugu News