జగనన్న వదిలిన బాణాన్ని అని మీకోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లికి అన్యాయం చెయ్యమని ఏ పార్టీ చెప్పింది?: గంటా శ్రీనివాసరావు

Ganta Srinivas Rao comments on Jagan
  • వైఎస్ హయాంలో ఒకటిగా ఉన్న కుటుంబం జగన్ నిర్వాకంతో రెండుగా చీలిపోయిందన్న గంటా
  • తల్లి, చెల్లి కష్టాన్ని వాడుకుని సీఎం అయ్యాక బయటకు పంపించేశారని విమర్శ
  • కుటుంబాన్ని గౌరవించలేని వాడు సమాజాన్ని గౌరవించలేడని వ్యాఖ్య
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి విమర్శలు గుప్పించారు. మీ నాన్న గారి హయాంలో ఒకే మాట, ఒకే బాటగా ఉండే కుటుంబం తమరి నిర్వాకంతోనే రెండుగా చీలిపోయిందన్న లోగుట్టు ప్రపంచానికంతా తెలుసు జగనన్నా అని ఎద్దేవా చేశారు. మా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారంటూ ఈరోజు ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. 

మీరు జైల్లో ఉన్న సమయంలో మీ విజయానికి అహర్నిశలు శ్రమించిన మీ తల్లి, చెల్లి కష్టాన్ని వాడుకుని సీఎం అయ్యాక వారిని బయటకి తరిమేసిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. ఏపీ రాజకీయాల్లో జగనన్న వదిలిన బాణాన్ని అని మీ కోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లికి అన్యాయం చెయ్యమని ఏ పార్టీ చెప్పింది? ఏ నాయకుడు చెప్పాడు? అని ప్రశ్నించారు. మీ చెల్లికి ఆస్తి పంపకాల్లో అన్యాయం చెయ్యమని, ఎంపీ టికెట్ ఇవ్వొద్దని ఏ పార్టీ చెప్పింది? ఏ నాయకుడు చెప్పాడు? అని అడిగారు. ఢిల్లీలో తన తండ్రి హత్య కేసు నిందితుల్ని శిక్షించాలని కాళ్ళు అరిగేలా తిరుగుతున్న మరొక చెల్లికి న్యాయం చెయ్యొడ్డని ఏ పార్టీ చెప్పింది? ఏ నాయకుడు చెప్పాడు? అని ప్రశ్నించారు.  

తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని గౌరవించలేనివాడు.. సమాజాన్ని కూడా గౌరవించలేడనే విషయం మరోసారి మీ ద్వారా నిరూపితమయిందని అన్నారు. మీరు పెట్టిన చిచ్చే రాబోయే ఎన్నికల్లో మిమ్మల్నే చుట్టుముట్టబోతోందనే విషయాన్ని గమనించండి జగన్మోహన్ రెడ్డి గారూ అని గంటా పేర్కొన్నారు.
Go Back to Shorts
Ganta Srinivasa Rao
Telugudesam
Jagan
YSRCP

More Telugu News