ఈ విధానం నిజంగా గేమ్ చేంజర్ అవుతుంది: చంద్రబాబు

Chandrababu attends meeting in Amalapuram
  • అమలాపురంలో చంద్రబాబు పర్యటన
  • అమలాపురం ప్రగతి కోసం ప్రజావేదిక కార్యక్రమం
  • హాజరైన చంద్రబాబు... వివిధ రంగాల నిపుణులతో సమావేశం
భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ‘అమలాపురం ప్రగతి కోసం ప్రజావేదిక’ సదస్సులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదుల వంటి వివిధ రంగాల నిపుణుల అభిప్రాయాలు, ఆలోచనల్ని రాష్ట్ర భవిష్యత్ కోసం వినియోగించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ...

• విజన్ డాక్యుమెంట్-2047లో నేను 5 ప్రతిపాదనలు పెట్టాను. వాటిలో ప్రధానమైనది సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ హైబ్రిడ్ మోడల్. ఈ విధానం నిజంగా గేమ్ ఛేంజర్ అవుతుంది. అమలాపురానికి అవసరమైన విద్యుత్ మొత్తాన్ని ఇక్కడే తయారుచేసుకోవచ్చు. సరఫరాలో నష్టాలు తగ్గుతాయి. దాంతో గృహావసరాలకు, పరిశ్రమలకు సరిపడిన విద్యుత్ కు ఎలాంటి లోటు ఉండదు.
• విజన్-2047 లో రెండో పాలసీ వాటర్ పాలసీ.. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని నీటివనరులు మనకు ఉన్నాయి. గంగా కావేరి అనుసంధానంలో గోదావరి నదికూడా ఉంది. గోదావరి నుంచి ఏటా 2, 3 వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. దాన్ని సక్రమంగా వినియోగించుకుంటే రాష్ట్రానికి నీటి కొరతే ఉండదు. దాని కోసమే పోలవరం ద్వారా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాను.
• ఒకప్పుడు జాతీయ రహదారులు చాలా అధ్వాన్నంగా ఉండేవి. బీవోటీ కింద కొత్తగా విశాలమైన రహదారులు వేయడంతో అభివృద్ధికి దారులు ఏర్పడ్డాయి.
• వాటర్ పాలసీ తర్వాత  మూడోది డీప్ డ్రైవ్ టెక్నాలజీ. సాంకేతికత అనేది ఎంతలా మారిపోతుందో, ఎంతగా ప్రజల్ని ప్రభావితం చేస్తుందో ఊహకు అందని విషయం. సాంకేతికతలో మానవ మేథస్సుదే ప్రధాన పాత్ర.
• తరువాత నాలుగోది పాపులేషన్ పాలసీ... ఇంతకు ముందు జనాభాను కంట్రోల్ చేశాం. భవిష్యత్ లో పాపులేషన్ మేనేజ్ మెంట్ జరగాలి. పాపులేషన్ ను సక్రమంగా మేనేజ్ చేయగలిగితే, మనం 100 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి వంద దేశాలకు నాయకత్వం అందించే శక్తి మన దేశానికి వస్తుంది.
• విజన్ డాక్యుమెంట్-2047లో చివరి పాలసీ... గ్లోబల్ థింకింగ్. కోవిడ్ వచ్చినప్పుడు ఇళ్లల్లో ఉండే పనులు చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి ఊరి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తూ, సంపాదించుకునే అవకాశం కలగాలి. ప్రతి ఒక్క రూ గ్లోబల్ లీడర్స్ గా మారాలన్నదే నా ఆలోచన.
• సూపర్ సిక్స్ పేరుతో కొన్ని పథకాలు ప్రకటించాను. అవి మహాశక్తి, యువగళం, అన్నదాత, బీసీల రక్షణ చట్టం, ఎంపవర్ మెంట్, ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించడం. వీటిలో వినూత్నమైనది పేదరికం లేని సమాజం తయారుచేయడం.
• ప్రజలు, ప్రభుత్వం,  ప్రైవేట్, పార్టనర్ షిప్ (P-4) మోడల్. ఈ విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తే, ప్రతి కుటుంబాన్ని పేదరికం  నుంచి గట్టెక్కించవచ్చు. దీన్ని షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ విధానాల్లో అమలు చేస్తే, పేదల్ని ధనికుల్ని చేయవచ్చన్నది నా ఆలోచన.  మనకు తెలివైన మానవ వనరులున్నాయి. అలానే నీటి వనరులు, తీర ప్రాంతం రాష్ట్రానికి ఉన్న వరాలు. వీటిని దృష్టిలో పెట్టుకొనే గతంలో విజన్-2029 అని  ఆలోచించాను. 2014 నుంచి వరుసగా టీడీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే 2029కి మనరాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ అయ్యేది.
• ఎప్పుడైనా నీరు, పరిశ్రమలు, రోడ్లు ఉంటేనే భూముల ధరలు పెరుగుతాయి. అభివృద్ధి జరిగితేనే భూమి విలువ పెరుగుతుంది. 25 ఏళ్ల క్రితం హైదరాబాద్ కోకాపేటలో ఎకరం భూమి ఎంత? ఇప్పుడు రూ.100 కోట్లకు చేరింది. కియా పరిశ్రమ రాకముందు అనంతపురం జిల్లాలో ఎకరం భూమి విలువ వేలల్లో ఉంటే, ఇప్పుడు లక్షలకు చేరింది.
• మంచి చెడుల విశ్లేషణలో కులం, మతం, ప్రాంతం, బంధుత్వం వంటివి అడ్డు వస్తే, మనం అనుకున్నది జరగదు. ప్రజలు దీనిపై ఆలోచించాలి. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకంపై ప్రజలతో పాటు మేధావులు కూడా స్పందించాల్సిన సమయం వచ్చింది. ప్రజాచైతన్యంతో, మార్పుతో ఏదైనా సాధించవచ్చు. నా ఆలోచనలు మీకు తెలియచేశాను... మీ అభిప్రాయాలు, ఆలోచనలు నాతో పంచుకోండి. మీరు చెప్పే వాటిని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ప్రణాళికలు తయారుచేస్తుంది.


Go Back to Shorts
Chandrababu
Amalapuram
TDP
Andhra Pradesh

More Telugu News