ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు, తెలంగాణ ప్రజలకు మధ్య అగాధాన్ని సృష్టించే యత్నాలు జరుగుతున్నాయి: షర్మిల

Sharmila reacts on speculations
  • కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం అంటూ మీడియాలో వార్తలు
  • చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగానే ఉంటానన్న షర్మిల
  • పని లేని, పస లేని దార్శనికులు అంటూ విమర్శలు
గత కొన్నిరోజులుగా మీడియా చానళ్లలో వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారన్న వార్తలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

వైఎస్ షర్మిల రెడ్డి తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఊహాజనిత కథలు కల్పిస్తూ, తనకు, తెలంగాణ ప్రజలకు మధ్య అగాధాన్ని సృష్టించేందుకు విఫలయత్నాలు జరుగుతున్నాయని షర్మిల ఆరోపించారు. 

"పని లేని, పస లేని దార్శనికులకు నేను చేప్పేది ఒక్కటే. నా రాజకీయ భవిష్యత్ మీద పెట్టే దృష్టిని, సమయాన్ని కేసీఆర్ పాలనపై పెట్టండి. అన్ని విధాలుగా కేసీఆర్ సర్కారు పాలనలో సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవిత మీద పెట్టండి. కేసీఆర్ కుటుంబం అవినీతిని ఎండగట్టండి. నా భవిష్యత్తు తెలంగాణలోనే... నా ఆరాటం, నా పోరాటం తెలంగాణ కోసమే. జై తెలంగాణ" అని పోస్టు పెట్టారు. 

అయితే పార్టీ విలీనం ఒట్టి మాటే అని గానీ, పార్టీని కొనసాగిస్తానని గానీ షర్మిల తన పోస్టులో ఎక్కడా పేర్కొనలేదు.
Go Back to Shorts
YS Sharmila
YSRTP
Congress
Telangana

More Telugu News