పోలీసులను అడ్డుపెట్టుకొని రెచ్చిపోతున్నారు: బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

Somu Veerraju lashes out at YSRCP leaders
  • అమర్నాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ.1 లక్ష చెక్కు అందించిన సోము వీర్రాజు
  • నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
  • పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ము కాసేలా ఉందని ఆగ్రహం
అధికార వైసీపీ అండతో ఆంధ్రప్రదేశ్ లో దారుణాలు చోటు చేసుకుంటున్నాయని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం విమర్శలు గుప్పించారు. బాపట్ల జిల్లా ఉప్పాలవారిపాలెంలో అమర్నాథ్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. వారికి రూ.1 లక్ష చెక్కును అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ము కాసేలా ఉండటం సరికాదన్నారు. ప్రజలను రక్షించాల్సిన అధికార పార్టీ నేతలు పోలీసులు అడ్డుపెట్టుకొని రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు.

కాగా, అమర్నాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన సోము వీర్రాజు ట్వీట్ చేశారు. 'ఇటీవల హత్యకు గురికాబడిన బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజవోలుకు చెందిన పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని నేడు పార్టీ శ్రేణులతో కలిసి పరామర్శించాను. రాజకీయాలకు కొమ్ము కాయకుండా దోషులకు కఠినమైన శిక్ష పడేందుకు చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖను డిమాండ్ చేస్తున్నాను' అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
Go Back to Shorts
Somu Veerraju
BJP
Andhra Pradesh

More Telugu News