25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు: బండి సంజయ్

30 BRS MLAs are in touch with us says Bandi Sanjay
  • కాంగ్రెస్ పార్టీని పెంచేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారన్న సంజయ్
  • 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నారని ఆరోపణ
  • అవినీతిపరులను మోదీ ప్రభుత్వం వదలదని వ్యాఖ్య
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఆయన చెప్పారు. బీజేపీ కార్పొరేటర్లు తమతో టచ్ లో ఉన్నారని కేటీఆర్ అంటున్నారని... బీఆర్ఎస్ మాదిరి తాము రాజకీయ వ్యభిచారం చేయమని అన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారు పదవులకు రాజీనామా చేసిన తర్వాతే వారిని బీజేపీలోకి చేర్చుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని పెంచేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని... 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రతి నెలా డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు. 

హిందువుల గురించి తాను మాట్లాడుతూనే ఉంటానని... తన వల్లే బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు కూడా భాగ్యలక్ష్మి ఆలయం బాట పట్టాయని సంజయ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశాన్ని ఇవ్వాలని... కేసీఆర్ కుటుంబ సభ్యులు సహా అవినీతికి పాల్పడిన వారందరినీ జైలుకు పంపిస్తామని చెప్పారు. అవినీతిపరులను మోదీ ప్రభుత్వం వదలిపెట్టదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పారు.
Go Back to Shorts
Bandi Sanjay
BJP
KCR
KTR
BRS

More Telugu News