పంజాబ్ ప్రభుత్వం బాగా పని చేసింది.. అక్కడ ఖలిస్థానీ ప్రభావం లేదు: అమిత్ షా

No Khalistani Wave In Punjab says Amit Shah
  • అమృత్ పాల్ అరెస్ట్‌ ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుందన్న అమిత్ షా
  • పరిస్థితిని చాలా నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడి
  • పంజాబ్ ప్రభుత్వానికి కేంద్రం సహకరిస్తోందని వ్యాఖ్య
పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నందుకు అభినందించారు. ఓ జాతీయ చానల్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. 

అమృత్‌పాల్ సింగ్‌, అతడు నడుపుతున్న సంస్థపై పంజాబ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై అమిత్ షా సంతృప్తి వ్యక్తం చేశారు. పంజాబ్ ప్రభుత్వం బాగా పని చేసిందని, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పుకొచ్చారు.

పంజాబ్‌లో ఖలిస్థానీ భావాల ప్రభావం లేదని షా అన్నారు. ‘‘ఎన్నో సార్లు, ఎంతో మంది ప్రయత్నించారు. కానీ ప్రభుత్వాలు తమ పని తాము చేశాయి. ప్రస్తుత పంజాబ్ సర్కారు కూడా మంచి పని చేసింది. కేంద్రం సహకారం అందించింది. పరిస్థితిని మేము చాలా నిశితంగా పరిశీలిస్తున్నాం’’ అని తెలిపారు.

అమృత్ పాల్ అరెస్ట్‌ ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుందని ఆయన అన్నారు. గతంలో అతడు స్వేచ్ఛగా తిరిగేవాడని, ఇప్పుడు తన కార్యకలాపాలను నిర్వహించలేకపోతున్నాడని చెప్పారు. భారత దేశ ఐక్యత, సార్వభౌమాధికారాలపై ఎవరూ దాడి చేయలేరన్నారు.

ఇండియన్ హై కమిషన్ కార్యాలయాలపై దాడులు జరిగితే తమ ప్రభుత్వం సహించబోదని చెప్పారు. భారతదేశానికి వ్యతిరేకంగా విదేశీ గడ్డపై నుంచి కుట్ర జరిగినపుడు దర్యాప్తు చేసే సమర్థత ఎన్‌ఐఏకు ఉందని, ఆ సంస్థను ఆ స్థాయిలో అభివృద్ధి చేశామని చెప్పారు. లండన్‌లోని ఇండియన్ హై కమిషన్ కార్యాలయంపై జరిగిన దాడిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారని, దర్యాప్తును ప్రారంభించారని చెప్పారు.
Go Back to Shorts
Amit Shah
Punjab
AAP
Amritpal Singh
khalistan
waris punjab de

More Telugu News