రూ.2 వేల నోట్లు రద్దు చేస్తున్నారని చెప్పి.. రూ.2 కోట్లు కొట్టేశారు.. కానీ..

lb nagar police arrested a four member gang who stole rs2 crores
  • రూ.2 వేల నోట్లకు బదులు 500 నోట్లు ఇస్తే కమీషన్ ఇస్తామని మోసం
  • ఓ వ్యాపారి నుంచి డబ్బు తీసేసుకున్న గ్యాంగ్
  • హైదరాబాద్ ఎల్బీనగర్ లోని మెట్రో స్టేషన్ వద్ద ఘటన 
  • పక్కా స్కెచ్ వేసి నలుగురు నిందితులను పట్టుకున్న పోలీసులు
రూ.2 వేల నోట్లు రద్దు చేస్తున్నారని నమ్మించి రూ.2 కోట్లు కొట్టేసిందో గ్యాంగ్. నోట్లు మారిస్తే 20 శాతం కమీషన్ ఇస్తామని చెప్పి.. ఓ వ్యక్తిని మోసం చేసింది. కానీ తమపై నిఘా వేసిన పోలీసుల గురించి మరిచిపోయింది. పోలీసులు పక్కా స్కెచ్ వేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో జరిగిందీ ఘటన. 

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన షేక్ రోషన్ మెహబూబ్ గతంలో చీటింగ్ కేసులో జైలుకెళ్లి వచ్చాడు. రూ.2 వేల నోట్లు రద్దు చేస్తున్నారని చెప్పి, కమీషన్ ఇస్తానని చెప్పి కొంతకాలంగా మోసాలకు పాల్పడుతున్నాడు. ఇందుకోసం కొలంపల్లి శ్రీనివాస్‌, బింగి వాసు, సింగమశెట్టి రాములు అనే వ్యక్తులతో గ్యాంగ్‌ ఏర్పాటు చేశాడు.

కొన్నిరోజుల కిందట వ్యాపారి ప్రభాకర్ గౌడ్ తో మెహబూబ్ పరిచయం పెంచుకున్నాడు. తాను హోటల్ బిజినెస్ చేస్తానని, కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల నోట్లను త్వరలోనే రద్దు చేస్తుందని చెప్పుకొచ్చాడు. తమ వద్ద పెద్ద మొత్తంలో రూ.2 వేల నోట్లు ఉన్నాయని, వాటిని రూ.500తో ఎక్స్ చేంజ్‌ చేస్తే రూ.20 శాతం కమీషన్‌ ఇస్తామని ప్రభాకర్ ను నమ్మించాడు.

మెహబూబ్‌ చెప్పిన విధంగా ప్రభాకర్‌‌ రూ.500 నోట్లను సేకరించాడు. 20 శాతం కమీషన్ వస్తుందనే ఆశతో స్నేహితులు, బంధువుల వద్ద రూ.కోటి 90 లక్షల విలువైన రూ.500 నోట్లు సేకరించాడు. మెహబూబ్ చెప్పినట్లుగా డబ్బు తీసుకుని శనివారం ఉదయం ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ కు వచ్చాడు. డబ్బును వారికి అందించాడు.

అయితే ఇక్కడే ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ విషయంపై అప్పటికే సమాచారం అందుకున్న ఎస్ ఓటీ పోలీసులు.. మెట్రో స్టేషన్ వద్ద కాపుకాసి మెహబూబ్, అతడి గ్యాంగ్ లోని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రూ.కోటి 90 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్లు రాచకొండ సీపీ చౌహాన్ తెలిపారు.
Go Back to Shorts
lb nagar police
four member gang
2 thousand notes
exchange

More Telugu News