మాకు ఎవరూ చేసింది ఏమీ లేదు: కాంతారావు కూతురు సుశీలారావు  

 Kantha Rao Daughter Sushila Rao Inteview
  • జానపద కథానాయకుడిగా కాంతారావు 
  • సొంత సినిమాల కారణంగా ఆర్ధికపరమైన ఇబ్బందులు
  • ఎవరూ ఎలాంటి సాయం చేయలేదన్న కూతురు
  • తండ్రి జ్ఞాపకంగా మిగిలింది తామేనంటూ ఆవేదన  
ఒక వైపున ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాలతోను .. మరో వైపున సాంఘికాలలో రొమాంటిక్ హీరోగా ఏఎన్నార్ దూసుకుపోతుండగా, జానపదాల జోనర్ ను ఫిక్స్ చేసుకుని ముందుకు వెళ్లిన కథానాయకుడిగా కాంతారావు కనిపిస్తారు. అప్పట్లో కండలు తిరిగిన శరీరంతో .. మంచి ఫిట్ నెస్ తో కనిపిస్తూ, తెలుగు తెర రాజకుమారుడు అనిపించుకున్నారు. వందలాది సినిమాలు చేసిన కాంతారావు, సొంత నిర్మాణంలో సినిమాలు తీయడం వలన, చివరిదశలో ఆర్ధికపరమైన ఇబ్బందులను చూశారు. 

ఆయనకి నలుగురు మగపిల్లలు .. ఒక కూతురు. కాంతారావు కూతురు సుశీలారావు హైదరాబాదులోని ' భాగ్ లింగంపల్లి'లో ఒక సింగిల్ బెడ్ రూమ్ ఇంట్లో అద్దెకి ఉంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. " ఇటీవలే మా వారు చనిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఇక్కడ ఉంటున్నాను. నాకు ఇద్దరు అబ్బాయిలు .. ఒక అమ్మాయి. వాళ్లంతా కూడా ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. వాళ్లు పంపించే డబ్బుతోనే నెలకి 8 వేలు రెంట్ కడుతూ ఇక్కడే ఉంటున్నాను" అన్నారు. 

"మా నాన్నగారితోనే ఇండస్ట్రీతో మాకు సంబంధాలు తెగిపోయాయి. ఇండస్ట్రీ నుంచి మాకు ఎలాంటి సహాయ సహకారాలు లభించలేదు. ఆయన తరువాత మాకు ఎలాటి గుర్తింపు లేకుండా పోయింది. మూలవిరాట్టు లాంటి ఆయనే లేని తరువాత మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఇండస్ట్రీకి సంబంధించిన లైన్ లో మేము లేకపోవడం కూడా ఒక కారణం కావొచ్చు. మా నాన్నవైపు ఆయన ఒక్కడే కొడుకు .. మా అమ్మ వైపు ఆమె ఒక్కతే కూతురు. అందువలన మాకు బంధుబలగాలు కూడా లేవు" అని చెప్పారు.

"వెనకా ముందూ ఎవరూ లేకపోవడంతో, మా నాన్నగారి ప్రపంచం మేమే. కోదాడ దగ్గర లోని 'గుడిబండ'కి అప్పట్లో మా నాన్నగారు దొర. అక్కడ మాకున్న ఇల్లు ఇప్పుడు కూలిపోయింది. మా నాన్నగారి విషయంలో చాలామంది చాలా రకాల వాగ్దానాలు చేశారు. అది చేస్తాం .. ఇది చేస్తాం అంటూ హడావిడి చేశారు. కానీ ఎవరూ ఏమీ చేయలేదన్నది వాస్తవం. ఈ గడ్డపై ఆయన గుర్తులు .. జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయంటే అది మేమే" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Kantha Rao
Sushila Rao
Tollywood

More Telugu News