స్వేచ్ఛాయుత ఓటింగ్ కే నా ప్రాధాన్యత: తమ్మినేని

I love democracy says Tammineni Sitaram
  • ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలే ఊపిరి
  • ప్రజాస్వామ్యం బతికితేనే మనకు బతుకు ఉంటుంది
  • ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరగాలి
భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలే ఊపిరి అని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రజలందరూ వారికి నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకోవచ్చని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలోని తన స్వగ్రామం తొగరాంలో ఈరోజు ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వేచ్ఛాయుత ఓటింగుకే తన ప్రాధాన్యత అని అన్నారు. తన స్వగ్రామంలో అందరూ స్వేచ్ఛగా ఎన్నికల్లో పోటీ చేసే వాతావరణం ఉందని చెప్పారు. ఇక్కడ ఏదో జరిగిపోతోందంటూ జరగుతున్నదంతా ప్రచారం మాత్రమేనని అన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసేది స్థానిక సంస్థలేనని చెప్పారు.

ఐ లవ్ డెమోక్రసీ, ఐ సపోర్ట్ డెమోక్రసీ అని తమ్మినేని అన్నారు. ప్రజాస్వామ్యం బతికితేనే మనందరికీ బతుకు ఉంటుందని చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో ప్రో-సీఎం ఓటింగ్ జరిగిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో కూడా ప్రజాతీర్పు ప్రజాస్వామ్యయుతంగానే ఉంటుందని చెప్పారు.

ప్రశ్నించే తత్వం ప్రజల్లో పెరగాలని స్పీకర్ అన్నారు. ఎన్నికల నిర్వహణను ఒక ప్రతిపక్ష పార్టీ కోర్టు ద్వారా ప్రశ్నించిందని... అది వారికున్న హక్కు అని చెప్పారు. ఎన్నికల నిర్వహణపై మొన్న కోర్టు స్టే విధించగానే అందరం ఆగిపోయామని... నిన్న గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఎన్నికలకు సిద్ధమైపోయామని... ప్రజాస్వామ్యం గొప్పదనం ఇదేనని అన్నారు.
Go Back to Shorts
Tammineni Sitaram
YSRCP

More Telugu News