అత్యాచారం చేసి, చంపేస్తామని నన్ను బెదిరిస్తున్నారు!: హీరో సుశాంత్ ప్రియురాలు రియా

rhea on sushant case
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన రియా
  • ఏడాది కాలంగా సుశాంత్‌తో సహజీవనం చేశానని వివరణ
  • దర్యాప్తును పాట్నా‌ నుంచి ముంబైకి బదిలీ చేయాలని వినతి
  • కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందన్న రియా
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ జరుపుతోన్న విషయం తెలిసిందే. అతడి ప్రియురాలు రియా చక్రవర్తిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించి, ఈ కేసు దర్యాప్తును పాట్నా‌ నుంచి ముంబైకి బదిలీ చేయాలని పిటిషన్‌ వేసింది.

ఇందులో ఆమె ఆసక్తికర విషయాలు తెలిపింది. గత ఏడాది కాలంగా తామిద్దరం సహజీవనం చేస్తున్నామని ఆమె చెప్పింది. గత నెల‌ 8న సుశాంత్‌ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయినట్లు ఆమె తెలిపింది. కుంగుబాటుతో బాధ పడుతున్న సుశాంత్‌ మందులు వాడేవాడని చెప్పింది.

గత నెల బాంద్రాలోని తన నివాసంలో అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని వాపోయింది. సుశాంత్ మరణంతో కుంగిపోయిన తనను కొంత మంది అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె పేర్కొంది. ముంబైలోని శాంతాక్రజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో దీనిపై ఇప్పటికే తాను ఫిర్యాదు చేశానని తెలిపింది.

సుశాంత్‌ ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు ఇప్పటికే తన వాంగ్మూలం నమోదు చేశారని చెప్పింది. అయినప్పటికీ పాట్నాలోనూ కేసు నమోదు కావడం తనను ఆందోళనకు గురిచేస్తోందని ఆమె తెలిపింది. సుశాంత్‌ తండ్రికి బీహార్‌లో పలుకుబడి ఉందని, దీంతో కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పింది. ఈ కేసును ముంబైకి బదిలీ చేయాలని కోరింది.
Go Back to Shorts
Sushant Singh Rajput
Bollywood
India

More Telugu News