కరోనా బారిన పడ్డ తొలి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే!

YSRCP Mla Gest Corona
  • ఎస్ కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు వైరస్
  • గన్ మెన్ కు కూడా సోకిన మహమ్మారి
  • కుటుంబ సభ్యుల క్వారంటైన్
ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా ఓ ఎమ్మెల్యేకు కరోనా సోకింది. విజయనగరం జిల్లా ఎస్ కోట ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కడుబండి శ్రీనివాసరావుకు వైరస్ పాజిటివ్ వచ్చింది. గత రెండు మూడు రోజులుగా ఆయన అనారోగ్యం బారిన పడగా, పరీక్షించిన వైద్యులు, కరోనా లక్షణాలు కనిపించే సరికి నమూనాలు సేకరించి, పరీక్షలు జరిపించారు. దీంతో ఆయనకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఆ వెంటనే ఆయన గన్ మెన్ కు పరీక్షలు జరిపించగా, ఆయనకూ వైరస్ సోకినట్టు తేలింది. ప్రస్తుతం కడుబండిని చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని ఓ గెస్ట్ హౌస్ కు తరలించారు. ఆయన కుటుంబ సభ్యులను క్వారంటైన్ చేసి, కరోనా టెస్ట్ లు జరిపించాలని నిర్ణయించిన వైద్యాధికారులు, అందరి నమూనాలనూ సేకరించారు.

కాగా, కొన్ని రోజుల క్రితం కడుబండి అమెరికాలో పర్యటించి రాష్ట్రానికి వచ్చారు. ఆ సమయంలో అందరు విదేశీ ప్రయాణికులకు చేసినట్టే, ఆయనకూ వైద్య పరీక్షలు చేశారు. ఆయనలో వైరస్ లక్షణాలు అప్పుడు కనిపించలేదు. ఆ తరువాత ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడంతో పాటు రాజ్యసభ ఎన్నికల్లోనూ ఓటు వేశారు. అమెరికా నుంచి వచ్చిన తరువాత ఎందరో పార్టీ నాయకులు, కార్యకర్తలను కడుబండి శ్రీనివాసరావు కలసుకోవడంతో, ఆ పార్టీలో ఇప్పుడు కలకలం మొదలైంది.

Go Back to Shorts
YSRCP
SKota
K SrinivasaRao
Corona Virus

More Telugu News