ఇన్ని జీవోల రద్దా? కోర్టులతో ప్రభుత్వం ఇన్ని చివాట్లు తినడం గతంలో ఎన్నడూ లేదు: చంద్రబాబు

One year is full of mistakes Chandrababu fires on Jagan
  • ఏడాదిలోనే ప్రజల భవిష్యత్తును నాశనం చేశారు
  • టీడీపీ పాలనలో ఎప్పుడైనా గ్యాంగ్ వార్ లు జరిగాయా?
  • దారి తప్పిన ప్రభుత్వాన్ని ప్రజలే చక్కదిద్దాలి
ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ పై వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. 'ఒక్క ఛాన్స్ ఇమ్మని కాళ్ళావేళ్ళా పడి బతిమాలి అధికారంలోకి వచ్చినవారు గత ప్రభుత్వాలతో పోటీపడి మంచిపేరు తెచ్చుకోవాలి. కానీ పాలకులు ఆ అవకాశాన్ని చేజేతులా కాలరాశారు. అవినీతి,అరాచకాలతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి, ఏడాదిలోనే ప్రజల భవిష్యత్తును నాశనం చేశారు.

తొలి ఏడాదిలోనే ఇన్ని తప్పులా? ఇంత ప్రజా వ్యతిరేక పాలనా? ఇన్ని జీవోల రద్దా? ప్రభుత్వం కోర్టులతో ఇన్ని చివాట్లు తినడం గతంలో ఎన్నడూ లేదు. అన్ని రంగాల్లో అభివృద్ధి రివర్స్. పేదల సంక్షేమంలో రద్దులు, కోతలు, నిధుల దారి మళ్లింపు, దుర్వినియోగం.

రాష్ట్రాన్ని రౌడీల రాజ్యంగా మార్చారు. తెలుగుదేశం ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా గ్యాంగ్ వార్ లు జరిగాయా? నేరగాళ్ల పాలన ఎలా ఉంటుందో చెప్పడానికి వైసీపీ అరాచకాలే రుజువు. మోసగాళ్లు అధికారంలోకి వస్తే అన్నీ మోసాలే. దగాకోరుల రాజ్యంలో అన్నివర్గాల ప్రజలకు దగానే.  

ఏడాదిలో 90% హామీలు నెరవేర్చారో.. 90% మోసాలకు పాల్పడ్డారో ప్రజల్లోకి వెళ్లి అడిగితే వాళ్లే చెబుతారు. 3 రాజధానుల బిల్లు, పీపీఏల రద్దు, బీసీ రిజర్వేషన్ల తగ్గింపు, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు, కౌన్సిల్ రద్దు బిల్లు, ఎలక్షన్ కమిషనర్ తొలగింపు, స్కీముల రద్దులు, పేర్లు మార్పు, జీవోల రద్దులు అన్నీ తుగ్లక్ చర్యలే, అనాలోచిత అహంభావ నిర్ణయాలే, చేతగాని పాలన నిర్వాకాలే. ఇలా రాష్ట్రం ఎప్పుడైనా నవ్వుల పాలైందా? పాలకుల అవినీతి, అసమర్థత రాష్ట్రానికి కీడు చేస్తుంటే అడ్డుకోవాల్సింది ప్రజలే. చేటుదాయక నిర్ణయాలను అడ్డుకునే బాధ్యత ప్రతిపక్షాలకే కాదు, ప్రజలకూ ఉంది' అని అన్నారు. వివిధ మాధ్యమాల ద్వారా వైసీపీ పాలనా లోటుపాట్లను ఎత్తిచూపాలని... దారితప్పిన ఈ ప్రభుత్వాన్ని చక్కదిద్దాలని పిలుపునిచ్చారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News