ఫాంహౌస్‌లో నిరాడంబరంగా.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కొడుకు వివాహం

kumaraswamy son marraige going in farm house
  • లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో అతిథులు 
  • కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులకే ఆహ్వానం
  • ఇళ్ల నుంచే ఆశీర్వదించాలని శ్రేణులకు కుమారస్వామి వినతి
సీనీ నటుడు కూడా అయిన తన కొడుకు వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలనుకున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆశల పై 'లాక్‌డౌన్‌' నీళ్లు చల్లింది. లాక్‌డౌన్‌ పొడిగింపు తప్పకపోవడంతో ఆంక్షల నేపథ్యంలో రాంనగర్ జిల్లాలోని బిడాడీ ఫాంహౌస్‌లో నిరాడంబరంగా పెళ్లి తంతును ఈ రోజు పూర్తి చేస్తున్నారు. పెళ్లిలో జరగాల్సిన సంప్రదాయ ఉత్సవాలన్నింటినీ రద్దు చేసి కేవలం ప్రధాన కార్యక్రమాలను మాత్రమే నిర్వహిస్తున్నారు.

కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడకు, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎం.క్రిష్ణప్ప మనుమరాలుకు ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 17వ తేదీన అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలని అప్పుడే నిర్ణయించారు. ఈలోగా లాక్‌డౌన్‌ వచ్చిపడినప్పటికీ ఈనెల 14వ తేదీతో ముగియనున్నందున పెళ్లికి ఇబ్బంది లేదని రెండు కుటుంబాల వారూ భావించారు.

కానీ లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగించడం, లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు భారీ ఫంక్షన్లకు అవకాశం లేకపోవడంతో పరిమిత సంఖ్యలో అతిథులతో ఫాంహౌస్‌లో పెళ్లి వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కుమార్ స్వామి మాట్లాడుతూ పెళ్లి వేడుకకు తమ రెండు కుటుంబాల సభ్యులు, అత్యంత ముఖ్యమైన అతిథులు తప్ప మరెవరినీ ఆహ్వానించలేదని, నాయకులు, శ్రేణులు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని పెళ్లి మండపం వద్దకు రావద్దని కోరారు. అదే సమయంలో తన కొడుకును ఇళ్ల నుంచే మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
Go Back to Shorts
Karnataka
ex cm kumaraswamy
son nikhil gouda
marriage

More Telugu News