కూలి పనులు చేసుకునే వ్యక్తికి షాకిచ్చిన ఐటీ అధికారులు

  • రూ. 2.59 లక్షల పన్ను చెల్లించాలంటూ నోటీసులు
  • తన పూర్వ యజమాని మోసం చేశాడంటున్న బాధితుడు
  • ఇంత మొత్తాన్ని ఎలా చెల్లించగలనంటూ ఆవేదన  
ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇచ్చిన నోటీసుతో ఓ దినసరి కూలీ బెంబేలెత్తిపోయాడు. రు. 2.59 లక్షల పన్ను చెల్లించాలని కోరుతూ సదరు వ్యక్తికి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని నబరంగ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, సనధారా గంద్ అనే వ్యక్తి దినసరి కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 2014-15లో ఈ వ్యక్తి రూ. 1.47 కోట్ల లావాదేవీలను నిర్వహించాడని... ఈ నేపథ్యంలో రూ. 2.59 లక్షల పన్నును చెల్లించాలంటూ అతనికి నోటీసులు అందాయి. దీంతో, అతను షాక్ కు గురయ్యాడు. కూలి పనులు చేసుకునే తాను ఈ మొత్తాన్ని ఎలా చెల్లించగలనని ఆవేదన వ్యక్తం చేశాడు.

గతంలో తాను పప్పూ అగర్వాల్ అనే వ్యక్తి ఇంట్లో ఏడేళ్లు పని చేశానని సనధారా గంద్ తెలిపాడు. ఆ సమయంలో తన భూమి పట్టాతో పాటు తెల్లకాగితంపై సంతకం చేసి ఇచ్చానని... పప్పూ యాదవ్ తనను మోసం చేశాడని వాపోయాడు. ఆయన ఏదో చేయబట్టే తనకు నోటీసులు వచ్చాయని చెప్పాడు.
Go Back to Shorts
Cooli
IT Notice
Income Tax

More Telugu News