గోదావరిలో బోటు మునకపై సీఎం జగన్ ఆరా

  • సహాయ చర్యలకు ఆదేశం
  • జాయింట్ కలెక్టర్ కు ఫోన్ చేసిన ఏపీ సీఎస్
  • రాజమండ్రి నుంచి సంఘటన స్థలానికి బయల్దేరిన హెలికాప్టర్
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద రాయల్ వశిష్ఠ అనే పర్యాటక బోటు మునిగిపోయిన ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అటు, ఘటనపై ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్ వెంటనే సంఘటన స్థలానికి పయనమయ్యారు. కాగా, సహాయ చర్యల కోసం రాజమండ్రి నుంచి హెలికాప్టర్ బయల్దేరింది.

ఈ ఘటనలో 15 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరినట్టు భావిస్తున్నారు. గండిపోచమ్మ ఆలయం నుంచి బయల్దేరిన ఆ బోటు పోలవరం వెళుతోంది. ప్రమాద సమయంలో బోటులో 72 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న సమయంలో పర్యాటక బోటు ప్రయాణానికి అనుమతినిచ్చిన అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Go Back to Shorts
Godavari
East Godavari District
Boat
Jagan

More Telugu News