చంద్రబాబు ఇల్లు మునగలేదు... అదంతా తప్పుడు ప్రచారమే: మాజీ మంత్రి డొక్కా
- చంద్రబాబు ఇల్లు మునగలేదు
- వరదపై సమాచారమున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం
- విమర్శలు గుప్పించిన డొక్కా
ప్రకాశం బ్యారేజ్ కి వచ్చిన వరదతో ఉండవల్లి కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసం మునిగి పోయిందంటూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఆయన ఇల్లేమీ నీటి ముంపులో లేదని, జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమేనని అన్నారు. కృష్ణానదికి ఎగువ నుంచి భారీగా వరద వస్తోందన్న సమాచారం ఉన్నా, జగన్ ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపట్టకుండా అలక్ష్యం చేసిందని విమర్శించారు. సీఎం, మంత్రి అనిల్ కుమార్, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వరద ముంపు నుంచి ప్రజలను కాపాడటంలో విఫలమైన ప్రభుత్వం, ప్రతిపక్షంపై బురద జల్లుతోందని డొక్కా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.