జాబితాలో నా పేరు లేకపోవడం బాధాకరం.. నాకు వేరే మార్గాలు ఉన్నాయి: మర్రి శశిధర్ రెడ్డి

  • మూడో జాబితాలో కూడా మర్రి శశిధర్ రెడ్డికి నిరాశ
  • సనత్ నగర్ ను టీడీపీకి కేటాయించిన కాంగ్రెస్
  • కార్యకర్తలతో చర్చించి త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తానన్న మర్రి
కాంగ్రెస్ పార్టీ తాజాగా 13 మందితో మూడో జాబితా విడుదల చేసింది. మరో ఆరుగురు అభ్యర్థుల పేర్లు మాత్రమే ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. మరోవైపు, కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డికి ఈ మూడు జాబితాల్లో నిరాశ ఎదురైంది. దీంతో, ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, మూడో జాబితాలో కూడా తన పేరు లేకపోవడం బాధాకరమని అన్నారు. తనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని... కార్యకర్తలతో మాట్లాడి, త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తానని చెప్పారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మర్రి శశిధర్ రెడ్డి ఆశిస్తున్న సనత్ నగర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ టీడీపీకి కేటాయించింది. 2014లో ఇక్కడి నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ 27,461 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పుడు శశిధర్ రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇప్పుడు టీడీపీ నుంచి కూన వెంకటేశ్ గౌడ్ పోటీ చేస్తుండగా, టీఆర్ఎస్ తరపున తలసాని బరిలో ఉన్నారు.
Go Back to Shorts
marri shasidhar reddy
congress
sanathnagar
ticket

More Telugu News