ఇప్పుడు మాట్లాడే వ్యక్తులకు ఆరోజు జరిగిన ఘోరం తెలియదా?: పరిటాల సునీత

  • వైఎస్ హయాంలో జరిగిన దారుణం గుర్తులేదా?
  • నా భర్తను పట్టపగలే హత్య చేయించారు
  • సీఎం చంద్రబాబుపై ఆరోపణలు తగదు
వైసీపీ అధినేత జగన్ పై దాడికి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమేంటి? అని ఏపీ మంత్రి పరిటాల సునీత ప్రశ్నించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, జగన్ పై దాడి ఘటన విషయమై ఆ పార్టీ నేతలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుపై ఆరోపణలు చేయడాన్ని ఆమె ఖండించారు.

ఈ సందర్భంగా తన భర్త పరిటాల రవి హత్య ఘటన గురించి ఆమె ప్రస్తావించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తన భర్తను పట్టపగలే పోలీస్ స్టేషన్ దగ్గరే హత్య చేయించారని, ఇప్పుడు టీవీల్లో మాట్లాడే వ్యక్తులకు ఆరోజు జరిగిన ఘోరం తెలియదా? అని ప్రశ్నించారు. తన భర్త హత్యకు గురైనప్పుడు తమ కుటుంబాన్ని ఆదుకున్నది చంద్రబాబు ఒక్కరేనన్న విషయాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. జగన్ పై దాడి ఘటనను ఖండించిన సునీత, డ్రామాలు ఆడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 
Go Back to Shorts
paritala sunitha

More Telugu News