శ్రీదేవి మరణం నాలో వ్యక్తిగతంగా మార్పు తీసుకొచ్చింది: హీరో నాగార్జున

  • శ్రీదేవి మరణించారంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా
  • ఆమె మరణం నాకు జీవిత పాఠం నేర్పింది
  • శ్రీదేవి చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను మాటల్లో చెప్పలేం
అందాల తార శ్రీదేవి మృతి చెంది ఇన్ని రోజులవుతున్నా ఆమె స్మృతులు సినీ ప్రముఖులను వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా, శ్రీదేవి గురించి ప్రముఖ హీరో నాగార్జున ప్రస్తావించారు. శ్రీదేవి మరణించారంటే తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, ఆమె మరణం తనకు జీవిత పాఠం నేర్పిందని ఓ ఇంటర్వ్యూలో నాగార్జున అన్నారు.

శ్రీదేవి హఠాన్మరణం తనలో వ్యక్తిగతంగా మార్పు తీసుకొచ్చిందని, తనకు ప్రియమైన వారిని మరింత ప్రశంసించేలా, వారికి ఇంకా దగ్గరయ్యేలా చేసిందని చెప్పారు. దక్షిణాది, హిందీ చిత్ర పరిశ్రమలలో నటిగా ఒకే రకమైన ప్రాముఖ్యతను సంపాదించుకున్న శ్రీదేవి చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను మాటల్లో చెప్పలేమని అన్నారు.  

ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో శ్రీదేవితో కలిసి తాను నటించిన 'గోవిందా గోవింద' చిత్రం గురించి ప్రస్తావించారు. ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు కెమెరా ముందు శ్రీదేవి చాలా సంతోషంగా ఉండేవారని, కెమెరా స్విచ్చాఫ్ చేస్తే ఆమె తన నిజజీవితంలోకి వచ్చేసే వారని చెప్పిన నాగార్జున, తాను నటిస్తున్నంత కాలం శ్రీదేవిని మిస్ అవుతూనే ఉంటానని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, వర్మ దర్శకత్వంలోరూపొందిన ‘ఆఫీసర్’ చిత్రం జూన్ 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో నాగార్జున పాల్గొంటున్నారు.  
Go Back to Shorts
Tollywood
Nagarjuna
sri devi

More Telugu News