జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఐవైఆర్ కృష్ణారావు!
- కేటాయించిన నిధుల లెక్కలను కేంద్రం అడగకూడదన్న జేపీ
- జేపీ వ్యాఖ్యలతో ఏకీభవించనన్న ఐవైఆర్
- నిధులు ఇచ్చినప్పుడు.. లెక్కలు అడిగే హక్కు ఉంటుందన్న మాజీ సీఎస్
పవన్ కల్యాణ్, జయప్రకాష్ నారాయణ, ఉండవల్లిల ఆధ్వర్యంలో జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో జేపీ వ్యక్తపరిచిన అభిప్రాయాన్ని ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తప్పుబట్టారు. ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టుకు లేదా పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించినా... దానికి సంబంధించిన లెక్కలను కేంద్రం అడగకూడదని జేపీ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని ఐవైఆర్ అన్నారు. నిధులను కేటాయించినప్పుడు... వాటిని దేనికి ఖర్చు చేశారు? ఎలా ఖర్చు చేశారు? అని అడిగే హక్కు కేంద్రానికి ఉంటుందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ విధివిధానాల్లో చేర్చితే బాగుంటుందని సూచించారు.