నిజంగా నేను జయలలిత కూతురినే... ఈ విషయం ఈ మధ్యే తెలిసింది!: తాజా ఇంటర్వ్యూలో అమృత

  • పెంపుడు తల్లి చనిపోయిన తరువాత విషయం తెలిసింది
  • బంధువులతో నిర్ధారించుకున్నాకే మీడియా ముందుకు
  • స్పష్టం చేసిన అమృత
తాను తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెనని చెబుతూ తెరపైకి వచ్చిన అమృత, మరిన్ని విషయాలను ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తాను నిజంగా జయలలిత కుమార్తెనేనని, ఆ విషయం తనకు ఈ మధ్యే తెలిసిందని అన్నారు. తన పెంపుడు తల్లి శైలజ  2015లో మరణించే వరకూ ఆమే తల్లని భావించానని, పెంపుడు తండ్రి ఈ ఏడాది మార్చిలో చనిపోయే ముందు తనకు అసలు విషయం చెప్పారని, ఆపై బంధువులను సంప్రదించి, తాను ఆమె కుమార్తెనేనని నిర్దారించుకుని ఇప్పుడు విషయాన్ని బయట పెట్టానని అన్నారు.

1996లో తొలిసారిగా అమ్మను తాను చూశానని అమృత చెప్పుకొచ్చారు. అప్పుడామె అధికారం కోల్పోయి, తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఉన్నారని, తనను చూసిన తరువాత భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారని చెప్పారు. తనను కౌగిలించుకుని ముద్దాడారాని, ఆమె వైఖరి అప్పట్లో తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు. తాను జయలలిత కుమార్తెనేనని చెప్పడానికి డీఎన్ఏ పరీక్షలు జరిపించడం ఒక్కటే మార్గమని అన్నారు. ఆమె మరణించే ముందు స్పృహలో ఉంటే తనను కచ్చితంగా పిలిపించుకుని ఉండేవారని చెప్పారు.
Go Back to Shorts
Amrutha
Jayalalitha
Tamilnadu

More Telugu News