తాజ్ మహల్ ను కూలగొడితే బీజేపీకి మద్దతిస్తా: సమాజ్ వాదీ నేత ఆజం ఖాన్ సంచలన వ్యాఖ్య

  • తాజ్ తో పాటు ఎర్రకోట, పార్లమెంట్, కుతుబ్ మినార్ వద్దు
  • అవన్నీ బానిసత్వానికి ప్రతీకలు
  • అన్నింటినీ కూల్చాలని ఆజం ఖాన్ డిమాండ్
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తాజ్ మహల్ ను కూల్చివేస్తే, తాను బీజేపీకి మద్దతు పలుకుతానని అన్నారు. తాజ్ ను కూలగొట్టాలన్న అంశాన్ని తాను దశాబ్దాల క్రితమే లేవనెత్తినట్టు చెప్పిన ఆయన, తాజ్ తో పాటు ఢిల్లీలోని ఎర్రకోట, పార్లమెంట్, కుతుబ్ మినార్ వంటివి బానిసత్వానికి ప్రతీకలని, వాటన్నింటినీ కూల్చాలని డిమాండ్ చేశారు.

యూపీ టూరిజం మంత్రి రీటా బహుగుణ ఆధ్వర్యంలో తయారు చేసిన ఓ పర్యాటక బ్రోచర్ లో తాజ్ ప్రస్తావన లేకపోవడం కలకలం రేపగా, ఆజం ఖాన్ స్పందించారు. వారణాసిలో గంగా హారతి ముఖ చిత్రంతో, కవర్ పేజీపై ఆదిత్యనాథ్, బహుగుణ చిత్రాలతో తయారైన 32 పేజీల పుస్తకాన్ని పలువురు విమర్శించిన సంగతి తెలిసిందే. ఇక తాజ్ మహల్ ను కూల్చి వేయాలన్న ఆజం ఖాన్ వ్యాఖ్యలపై, బహుగుణ మాట్లాడుతూ, తాజ్ ఓ సుప్రసిద్ధ కట్టడమని, రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో టూరిస్టులను ఆకర్షించే ప్రాంతమని, ఇప్పటికే తాజ్ పరిరక్షణకు రూ. 156 కోట్లు కేటాయించామని తెలిపారు. ఖాన్ వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు.
Go Back to Shorts
taj mahal
red fort
parliament
azam khan

More Telugu News